ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ?


రాజమండ్రిలో, చున్నిలాల్ జాజు రత్న మునిసిపల్ హై స్కూల్, కంబాలపేట టాంక్ సమీపంలో ఉంది. కొప్పిశెట్టి అనురాధ అందులో ఉపాధ్యాయిని. రోజు ఆ పార్కు మీదగా స్కూల్‌కి వెళ్తుంది.

2006 ప్రాంతంలో, అలాగే ఒక రోజు స్కూల్‌కివెళ్తున్నప్పుడు, ఆ పార్కుదగ్గిర మాసిపోయిన బట్టలతో, తైలసంస్కారంలేని, జుత్తునెరిసిపొయిన మనిషిని చూసింది. అతను మేని చాయ చూస్తే ఆ ప్రాంతాల వాడిగా కనపడడం లేదు. ఆకలికి తట్టుకొలేక అక్కడే పడేసిఉన్న వ్యర్ధ పదార్ధాలను, చెత్తకాగితాలను అతను తింటుండడం గమనించింది. రోజు అదే వరస. చూసి ఇక ఆగలేక పోయింది.

ఒకరోజు అతనికి తన ఇంట్లో వండుకుని తెచ్చుకున్న అహారాన్ని ఇచ్చింది. ఆకలిమీద ఉన్నాడేమో అతను అబగా తినేసాడు. ఇక ఆరోజునుంచి ఆమె దినచర్య మారిపోయింది. ప్రతి రోజు అతనికి ఆహరం సమకూర్చడంకూడ అమెకి తన దైనందిన కార్యక్రమాలలొ ఒక భాగమైపొయింది. అతనితో మాట్లాడి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అతను మాట్లాడితేగా. అతని భాష తెలియదు. ఆతనికేమొ ఈమె భాష అర్ధం కాదు. అతనికి అర్ధం కావడంలేదేమో అని తనకి తెలిసిన భాషలన్నిటిని ఉపయోగించింది. అతనికి హింది భాష అర్ధమయ్యింది. ఇంకేముంది? హిందిలో మాట్లాడడం మొదలుబెట్టింది. అతను ఒక మానసిక వికలాంగుడు అన్నది అనురాధకి అర్ధం అయ్యింది. కాని పట్టువదలని విక్రమార్కుడిలాగ అతన్ని గురించి వివరాలు తెలుసుకొవడానికి తన ప్రయత్నాన్ని మాన లేదు. కాని పాపం ఆ అభాగ్యుడు ఆమె కి ఆ వివరాలు ఇవ్వలేకపొయ్యాడు.

తన విద్యార్ధులతో అతనిని గోదావరిలో స్నానానికి పంపిచింది. తైలసంస్కారంలేని అతనిని శుభ్రపరిపించింది. ఇక ఆరోజునుండి అతనిలోనూ మార్పు వచ్చింది. ప్రతిరోజు గోదావరికెళ్ళేవాడు. నది ఒడ్డున స్నానం చేసేవాడు. ఆ చెత్తా, ఈ చెత్తా తినడం మానేసాడు. అనురాధ తెచ్చి పెట్టేదాక ఏ అహారాన్ని ముట్టుకునేవాడు కాదు. అనురాధ కూడా తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అతనికోసమని ఎండని, వానని వెరవకుండా అతనికి అహారాన్ని పెట్టేది. పగలని లేదు, రాత్రని లేదు.

అనురాధకి ఒక్కటే ఆలోచన. అతనిని వివరాలు తెలుసుకుని అతన్ని అతని బంధువులతో కలపాలని. ఒక మనిషిగా తను సాటి మనిషికి చెయ్యగలిగిన కనీస సాయం అని నమ్మింది.

ఆ రోజు అతనిని మళ్ళీ అడిగింది. ఆశ్చర్యం. అతని తన వివరాలను చెప్పాడు. ఎందుకో అనురాధ దానిని నమ్మలేక పోయింది. ఊరుకోలేదు. కాగితం కలం ఇచ్చి వ్రాయమంది. అతను వ్రాసిచ్చాడు. ఉహుం. ఇంకా అనురాధకి నమ్మకం దొరకలేదు. దాదాపు ఐదారు సార్లు వ్రాయించింది. అతను ఏ తప్పులేకుందా మళ్ళీ, మళ్ళీ ఆ వివరాలే పొల్లుపోకుండా వ్రాసిచ్చాడు.

ఇక అనురాధ ఆగలేదు. వెంటనే ఆ అడ్రస్సుకి ఉత్తరం వ్రాసింది.

నేపాలు దేశంలోని, కిలాలి రాష్ట్రానికి చెందిన సుకుమార్ రాజ్ చౌధరి కి, అక్కడి రాజ్వర గ్రామంలో పదిహేను ఎకరాల పొలం ఉంది. మానసికంగా క్రుంగిపొయిన అతనికి,మహరాష్ట్రలోని పుణే కి వైద్యం కోసం అతనికి తీసుకు వస్తే రాజ్ తప్పిపొయాడు. ఇక అతను లేడు, ఏ లోకాలకు తరలిపొయ్యాడో అనుకుంటున్న తరుణంలో, అనురాధ ఉత్తరం వారికి కొత్త ఆశలు చిగిర్చింది.

వారం తిరిగకుండానే వారు రాజమండ్రిలో దిగారు. అనురాధకి పెద్ద బహుమతి ఇస్తానన్నారు. కాని అనురాధ వాటిని సున్నితంగా తిరస్కరించింది.

సుకుమార్ రాజ్ చౌధరిని దాదాపు రెండు సంవత్సరాలు, ప్రతిఫలం ఏమి ఆశించకుండా, ఒక్క మానవతా దృక్పధంతో ఆదుకుని, తనవారితో కలిపిన కొప్పిశెట్టి అనురాధ అభినందనీయురాలు.

ఇంకా మనలో మానవత్వం బ్రతికే ఉంది అని చాటిచెబుతున్న అనురాధకి జేజేలు.
తరువాయి భాగానికి ఇక్కడ చూడండి.
* (ఇక్కడొక చిన్న విషయం. ఈ సమాచారం నేటి "ది హిందు" దినపత్రిక తెలియజెసింది. ఆ పేజి సంకేలని ఇక్కడ ఇస్తే సరిపోయేది గాని, ఎందుకో అది సరి అని తోచలేదు. ఇక కుదరని పరిస్థితులలో "ది హిందు" - వారు ప్రచురించిన ఫొటొ (ఫొటోగ్రాఫర్ ఎస్. రాంబాబు) ఇక్కడ వాడడం జరిగింది.

ఈ విషయంలో విజ్ఞతగల చదువరులు తమ అభిప్రాయాన్ని తెలియజేయగలరు).

9 వ్యాఖ్యలు:

VJ on October 12, 2007 2:33 AM   said...

చాలా బాగుంది ... అక్కడక్కడ మానవత్వం తన చిరునామా చెప్తూ ఉంది ఇంకా.

వింజమూరి విజయకుమార్ on October 12, 2007 2:51 AM   said...

చాలా గొప్ప విషయం చెప్పారు. అనూరాధ గారిది మ్రొక్క వలసిన మానవత్వం.

మరమరాలు on October 12, 2007 4:04 AM   said...

అనురాధ గారు చేసిన పని అభినందనీయం, ఇంత మంచి మనస్సు ఉన్న ఉపాధ్యాయిని దొరకటం ఆ స్కూల్ పిల్లలు చేసుకున్న పుణ్యం.
-మరమరాలు

Budaraju Aswin on October 12, 2007 4:54 AM   said...

anuradhar gaariki naa abhinadanalu
meekoonu
mee dvaaraane naaku ee vishayam telisindi

Anonymous on October 12, 2007 10:43 AM   said...

అనూరాధ గారికి అభినందనలు. మంచితనపు వార్తలను పంచాలి, అందరిలో మంచితనం పెంచాలి.

నేనుసైతం on October 12, 2007 1:21 PM   said...

మానవత్వానికి మారుపేరైన అనూరాధ గారికి, వారిని బ్లాగ్ లోకానికి పరిచయం చేసిన మీకు నా అభినందనలు.
-నేనుసైతం

radhika on October 12, 2007 3:23 PM   said...

మంచి విషయాన్ని,గొప్ప విషయాన్ని ఎన్ని సార్లయినా చెప్పవచ్చు.అనురాధ గారు అభినందనీయురాలు.అలాగే మీరు కూడా.మంచి విషయాన్ని పంచుకున్నందుకు.

Giri on October 14, 2007 3:48 AM   said...

ఇలా స్వచ్చందంగా ఇతరులకి సహాయం చేసే వారున్నారు కాబట్టే కలియుగం కుంటనైనా కుంటుతోంది, లేక పోతే ఎప్పుడో చతికిలబడేదే..

Post a Comment